
కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్, ఇప్పుడు కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ దాడి చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సింగర్ స్మిత తల్లి జోగుళాంబకు కరోనా పాజిటివ్ అని తేలింది.
జోగుళాంబ స్వయంగా ట్విట్టర్ (Twitter) ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ముచ్చటగా మూడు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా కూడా మూడోసారి కోవిడ్ బారిన పడ్డానని తెలిపారు. “కొత్త వేరియంట్ లక్షణాలు రోజు రోజుకు మారుతున్నాయి” అని చెబుతూ, మొదటి రోజు జ్వరం, రెండవ రోజు తలనొప్పి, మూడవ రోజు గొంతునొప్పి, నాల్గవ రోజు జలుబు, ఐదవ రోజు కడుపునొప్పి వంటి లక్షణాలు వచ్చాయని వివరించారు. ఇది “సకల కళా వల్లభన్” లా ఉందని ఆమె సరదాగా చెప్పారు.
ఆమె వివరించినట్లు వ్యాక్సిన్ వల్ల వైరస్ ఊపిరితిత్తుల వరకు వెళ్లలేదు కానీ, బలహీనత మాత్రం తీవ్రంగా ఉండటంతో పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టుతోందని తెలిపారు. “కేసుల్లేవు అనేది భ్రమ (illusion), అసలు ఎవ్వరూ టెస్టులు చేయించుకోవడంలేదు” అంటూ ప్రజలకు అప్రమత్తత సూచించారు. మాస్కులు మళ్లీ ఉపయోగించుకోవాలని, జాగ్రత్తలు తప్పనిసరి అన్న సందేశాన్ని ఇస్తున్నారు.
ప్రస్తుతం జోగుళాంబ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి, టెస్టులు, మాస్కులు, శానిటైజర్లు వంటి భద్రతా చర్యలు పాటించాలి.