Sat. May 9th, 2026
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

Mythri Sashi: ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్’ తెలంగాణ ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరింది. సంస్థ నిర్మించిన తాజా చిత్రం ‘జెట్‌లీ’ ప్రదర్శనను మల్టీప్లెక్స్‌లలో నిలిపివేయడంపై మైత్రీ భాగస్వామి కేతిరెడ్డి శశిధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. అసలు వివాదం ఏమిటంటే.. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీకెండ్ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ నిబంధనలపై గత కొంతకాలంగా మైత్రీ సంస్థకు, ఎగ్జిబిటర్లకు మధ్య భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మైత్రీ సినిమాలను సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని మైత్రీ గౌరవించినప్పటికీ, తాజాగా ఆ వివాదాన్ని మల్టీప్లెక్స్‌లకు కూడా పాకించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సింగిల్ స్క్రీన్ సమస్యకు, మల్టీప్లెక్స్ ప్రదర్శనలకు ఎలాంటి సంబంధం లేదని శశిధర్ తన లేఖలో పేర్కొన్నారు.

“మల్టీప్లెక్స్ నిబంధనల విషయంలో మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అలాంటప్పుడు ‘జెట్‌లీ’ చిత్రాన్ని మల్టీప్లెక్స్‌లలో ఆపివేయడం కేవలం మమ్మల్ని ఒత్తిడికి గురిచేయడమే. ఒక విభాగంలో సమస్యను అడ్డం పెట్టుకుని, సంబంధం లేని మరో విభాగంలో ప్రదర్శనలు ఆపడం వ్యాపార ధర్మం కాదు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ స్క్రీన్ సమస్యపై మొదటి నుంచి తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. అయితే చర్చలు పారదర్శకమైన వాతావరణంలో జరగాలని, ఇలాంటి బలవంతపు పద్ధతులు పరిశ్రమకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని లేఖలో హెచ్చరించారు. తక్షణమే పునరాలోచించి మల్టీప్లెక్స్‌లలో ‘జెట్‌లీ’ ప్రదర్శనకు అనుమతించాలని ఆయన కోరారు. మరి ఈ లేఖపై ఎగ్జిబిటర్ల సంఘం ఎలా స్పందిస్తుందో? ‘జెట్‌లీ’ సినిమాకు థియేటర్ల చిక్కులు వీడుతాయో లేదో వేచి చూడాలి.