క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ (విరుష్క) జంటకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లయి ఇన్నేళ్లయినా ఈ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తన భర్త విరాట్ కోహ్లీని, ఆర్సీబీ టీమ్ను ఉత్సాహపరచడానికి అనుష్క శర్మ మైదానానికి వచ్చారు. అయితే.. మ్యాచ్ సమయంలో గ్యాలరీలో కూర్చున్న ఆమె వేలికి ఉన్న ఒక వింత ఉంగరం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఆధ్యాత్మికతతో కూడిన లేటెస్ట్ గాడ్జెట్..
సాధారణ దుస్తుల్లో మెరిసిన అనుష్క శర్మ, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నంత సేపు ఆర్సీబీ విజయం కోసం ప్రార్థిస్తూ కనిపించారు. ఈ క్రమంలో ఆమె చూపుడు వేలికి ఉన్న డిజిటల్ రింగ్ కెమెరాల కంటికి చిక్కింది. నెటిజన్లు దీని గురించి ఆరా తీయగా.. అది కేవలం ఒక అందమైన నగ మాత్రమే కాదు, అంతకు మించిన ఉపయోగం ఉన్న ఒక లేటెస్ట్ గాడ్జెట్ అని తేలింది. దీనిని ‘రాధా నామ్ జప కౌంటర్ రింగ్’ లేదా ‘డిజిట్ జప మాల’ అని పిలుస్తారు.
ఇలా పనిచేస్తుంది..
సాధారణంగా దేవుడి నామాన్ని లేదా మంత్రాలను జపించడానికి రుద్రాక్షలు, స్ఫటిక మాలలను వాడుతుంటారు. కానీ ప్రయాణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అది కుదరదు. అందుకే ఈ ఆధునిక సాంకేతిక పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిని వేలికి ఉంగరంలా ధరించి, ప్రతిసారి మంత్రాన్ని పఠించినప్పుడు అందులోని బటన్ను నొక్కితే చాలు.. ఎన్ని సార్లు జపించామో అనే సంఖ్య దానికి ఉన్న చిన్న డిజిటల్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఆన్లైన్ మార్కెట్లో ఇది కేవలం రూ.150 నుంచి రూ.200 ధరలోనే లభిస్తుంది.
ఆధ్యాత్మిక మార్గంలో ‘విరుష్క’ జంట…
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ దీవెనలతో రాధావల్లభ సంప్రదాయాన్ని అమితంగా విశ్వసించే విరాట్, అనుష్కలు ఈ మధ్యకాలంలో పూర్తి ఆధ్యాత్మిక భక్తులుగా మారిపోయారు. గతంలో బృందావనం సందర్శించినప్పుడు విరాట్ కోహ్లీ చేతిలో కూడా ఇలాంటి జప కౌంటర్ కనిపించింది. తాజాగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచి ఫైనల్కు చేరాలంటూ అనుష్క ఈ రింగ్తో మైదానంలోనే ‘రాధా నామ జపం’ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా భర్త విజయం కోసం అనుష్క చేసిన ఈ డిజిటల్ జపం ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
