- ఢిల్లీలో పవన్ కళ్యాణ్ జాతీయతకు, సమగ్రతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.
- దక్షిణాది నేతలు ఢిల్లీలో భయపడతారని, దేశచరిత్రను గుర్తుచేశారు.
- జనసేన 12 ఏళ్లుగా దేశ సమగ్రతకు కట్టుబడి పోరాడుతోందన్నారు.
Pawan Kalyan Janasena Assembly In Delhi | ఢిల్లీ: రాజకీయాలు పక్కనపెట్టి దేశ బాధ్యత కల పౌరుడిగా ఆలోచించాలని, విభజన వాదాన్ని దూరం చేయాలని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దక్షిణాది నేతలు ఢిల్లీ మెడలు వంచుతామని రాష్ట్రంలో ఉన్నప్పుడు బాగా మాట్లాడతారు, కానీ ఢిల్లీకి వెళ్లినప్పుడు వారు భయపడతారని పేర్కొన్నారు. అందుకు కారణాలు విశ్లేసిస్తూనే జాతీయవాదం, జాతీయ సమగ్రత, ప్రాంతీయతత్వం, సమకాలీన రాజకీయాలపై జనసేన శ్రేణులకు ఢిల్లీ వేదికగా ఆయన దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీకి రాగానే దక్షిణాది నేతల్లో భయం..
ఢిల్లీలోని ఆశోక హోటల్లో సోమవారం నిర్వహించిన సేన ప్రస్థానం… దేశ సమగ్రత కోసం అనే జనసేన సమావేశంలో పాల్గొని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగు సహా దక్షిణాది రాష్ట్రాలు మేం ఢిల్లీ మెడలు వంచుతాం. తడాఖా చూపిస్తాం. చొక్కా పట్టుకుని నేలకు దించుతాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఢిల్లీకి రాగానే సీన్ మారిపోతుంది. వారి గొంతులోంచి మాటలు రావు. వాళ్లకు భయం అనుకుంట. ఢిల్లీ దేశ రాజధాని అనే విశిష్టతను చూసి మన నోటి నుంచి మాటలు రావు. ఇక్కడికి వచ్చి ఢిల్లీ గాఢతను చూసినప్పుడు, ఎందరో త్యాగాలు వారికి గుర్తుకువస్తాయి.
Additionally Learn: Chandrababu Singapore Tour: సింగపూర్ పర్యటనలో చంద్రబాబు.. ఏపీలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటలిస్టులకు ఆహ్వానం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సహా పలువురు ప్రముఖులు దాదాపు 2 ఏళ్ల 11 నెలలకు పైగా శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించారు. విభజన సమయంలో 2 కోట్ల ప్రజలు నిర్వాసితులుయ్యారు. 18 నుంచి 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఢిల్లీకి వచ్చినప్పుడు ఇవన్నీ మనకు గుర్తుకువస్తాయి. సరిహద్దు దేశాలే మనసులోకి వస్తాయి. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని అందరూ గుర్తించాలని, అందరికి తెలియాలన్నదే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటం వెనుక ఉన్న త్యాగాలు, పోరాటాలు గుర్తిస్తే జాతీయవాదం ప్రాధాన్యత తెలుస్తుంది. ఎంత బాధ్యతగా వ్యవహరించాలో తెలుసుకుని జనసేన పార్టీ స్ఫూర్తితో మీరు తిరిగి వెళ్లాలి.
పార్టీ కంటే జాతీయవాదం, దేశ సమగ్రతే ముఖ్యం..
2014 మార్చిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో జనసేన పార్టీని స్థాపించాం. పార్టీ ఏర్పాటై 12 ఏళ్లు పూర్తయింది. ఆ సమయంలో అధికారం గురించి ఆలోచించలేదు. దేశ సమగ్రతకు విఘాతం కల్పించే ఎలాంటి శక్తులనైనా ఎదిరించాలని, దేశం కోసం పాటుపడాలని మాత్రమే ఆలోచించాం. ఈ పుష్కర కాలంలో ఎన్నో పోరాటాలు చేశాం. ఆశలు కోల్పోయినా వెనక్కి తగ్గకుండా బలమైన సిద్ధాంతానికి కట్టుబడి 7 ప్రాథమిక సూత్రాలను వదలకుండా ముందుకు సాగాం. 21 ఎమ్మెల్యే, 3 ఎంపీ, 2 ఎమ్మెల్సీ స్థానాలను సాధించాం. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ 20 లక్షల సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల మన భావాజాలానికి ఆకర్షితులై కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి నుంచి చేరికలు జరుగుతున్నాయి. పార్టీ బాగుకంటే దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇచ్చాం. బ్రిటీషు వాళ్లు స్వాతంత్య్రం ఇచ్చినా.. దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టి కల్లోలం రేకెత్తించారు. 536కు పైగా సంస్థానాలలో కొన్ని భారత్లో విలీనం అయినప్పటికీ, బరోడా, నిజాం సంస్థానం, జునాఘడ్, ట్రావెన్ కోర్ లాంటివి స్వతంత్రంగా ఉండాలనుకున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషిచేసి సంస్థానాలను భారత్లో విలీనం చేశారు. 2 సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని సైతం మనుషులు మరిచిపోతారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు..
దేశ సమగ్రత స్ఫూర్తిని ఒక్కరోజులో ముందుకు తీసుకెళ్లలేం. ప్రతి తరం ఈ తీరుగా ఆలోచించి ముందుకెళ్లాలి. కానీ తమ స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సమగ్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశాం, కానీ తెలంగాణ ఏర్పాటును ఎప్పుడూ వ్యతిరేకించలేదు. రాష్ట్రాన్ని విభజించిన తీరు అసంతృప్తి, అశాంతిని సృష్టించింది. నేటికి ఆస్తుల పంపకాలు, కొన్ని అంశాల్లో విభజన ఇంకా అసంపూర్తిగా ఉంది. తెలంగాణలో జనసేన సభకు అనుమతులు ఇవ్వలేదు. ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రయోజనాల కోసం విభజించడానికి ఇలాంటి పనులు చేస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
బావిలో కప్పల్లా ఉంటే మనకు విషయాలు తెలియవు. విశాల ప్రపంచాన్ని చూడడానికి ఢిల్లీ రాజధాని పెద్ద వేదికను ఇచ్చింది. సుమతీ శతకంలో చెప్పినట్లు.. బలవంతమైన సర్పం సైతం చలి చీమల చేతికి చిక్కి చస్తుంది. చిన్న చిన్న ఆలోచనలు దేశ సమగ్రతను బలిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి భావజాలంలో చిక్కుకోకూడదని ఈ కార్యక్రమం ద్వారా చెబుతున్నాం. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా పోరాడాలి, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఎలా నడుచుకోవాలో చాటి చెప్పడమే జనసేన ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం ఉద్దేశం. ప్రజాస్వామ్య విలువలు, వికసిత్ భారత్, దేశ సమగ్రత, 12 ఏళ్ల నరేంద్ర మోదీ సర్కార్ పాలన, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వ పాలన, సరికొత్త తరం జెన్జీకి మార్గదర్శకత్వం లాంటివి మన సమావేశంలో ముఖ్య అజెండా అని’ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
దేశంలో ఇలా చేసిన తొలి రాజకీయ పార్టీ జనసేన.. నాదెండ్ల మనోహర్
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ దేశ సమైక్యత కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని ఏపీ మంత్రి, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ నేతలు గర్వపడే విధంగా జనసేనను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచనలతో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. 2014 నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రాంతీయ పార్టీగా భావించి అభివృద్ధి చేసుకుంటున్నా.. సేన ప్రస్థానం జాతీయ భావంతో ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ చెబుతుంటారని పేర్కొన్నారు. జనసేన పార్టీలో మీరు ఛాంపియన్గా ఉండాలంటే ఏ విధంగా నడుచుకోవాలో పవన్ అందరికీ దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారని గుర్తుచేసుకున్నారు. రాజీ లేకుండా పోరాటం చేయడంలో జనసేన వర్క్ జాతీయ సర్వీసుగా భావించాలన్నారు. 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను నెంబర్ వన్గా చేసిన గొప్ప నేత పవన్ అని కొనియాడారు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పార్టీ విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు.
తన రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నేషన్ ఫస్ట్ అని ఓ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి అయినందుకు మనం గర్వపడాలి. స్వాతంత్య్ర సమరయోధులు ఏ విధంగా పోరాటం, త్యాగాలు చేశారో.. మన పార్టీ విధానాల్లో అలాంటివి కొనసాగాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి నుంచి జనసేన నేతలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు. జాతీయ సమగ్రత కోసం ఏం చేయాలి, ఎలాంటి విధానాలను ముందుకు తీసుకెళ్లాలో తెలియజేప్పడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Viral Video of a Guy Dressed in Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
