Mon. Jul 6th, 2026
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్‌ప్రైజ్!

Pradeep Ranganathan: వరుస విజయాలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇటీవల ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్థాపించిన కొత్త నిర్మాణ సంస్థ ‘పిఆర్ షో’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. నటుడిగా మాత్రమే కాకుండా, రచయిత, దర్శకుడిగా ఇప్పటికే పలు రంగాల్లో తన సత్తా చాటిన ఆయన, ఇప్పుడు నిర్మాతగా కూడా తన అభిరుచికి తగ్గ కథలను ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో తన సినీ ప్రయాణంలో మరో కీలక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ చిత్రంలో ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన అశ్వత్ మరిముత్తు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా అనామిక మహి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతుండగా, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివాజీ సొంటినేని, మలయాళ నటి స్వాసిక కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే, చిత్రానికి ఒక్క దర్శకుడు కాకుండా ‘ది ఆల్ఫా యూనిట్’ పేరుతో పనిచేస్తున్న ఆరుగురు సభ్యుల బృందం దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం. విశాల్ టి.ఆర్, యష్ వి, నరేన్ సౌదా, చాణక్కియన్ ఆర్, ధనుష్ కుమార్, ఇళంపరితిల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథను మాత్రం స్వయంగా ప్రదీప్ రంగనాథనే అందించారు. సంగీత బాధ్యతలను యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ చేపట్టగా, సినిమాటోగ్రాఫర్‌గా దినేష్ పురుషోత్తమన్, ఎడిటర్‌గా ప్రదీప్ ఈ. రాఘవ్ పనిచేస్తున్నారు.

ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. వీడియో ద్వారా ప్రధాన తారాగణం, సాంకేతిక బృందాన్ని ఆసక్తికరంగా పరిచయం చేయడంతో పాటు, సినిమా కాన్సెప్ట్‌పై కూడా చిన్న హింట్ ఇచ్చారు. దీంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఎలాంటి కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది. నిర్మాతగా ఆయన తీసుకున్న ఈ కొత్త అడుగు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.