Varanasi: మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. భారీ విజువల్స్, పాన్ ఇండియా కథనం, రామాయణ ఛాయలతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఇప్పుడు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వెల్లడించిన వివరాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అమెరికా పర్యటనలో పాల్గొన్న కీరవాణి మాట్లాడుతూ, సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సంగీతంపై పూర్తిస్థాయిలో పని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్కు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో సంగీతాన్ని పూర్తి చేయడానికి దాదాపు ఐదు నెలల సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. జనవరి 2027 నాటికి తన పని పూర్తవుతుందని, అనంతరం మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ఇక ఈ మూవీని ఏప్రిల్ 2027 నాటికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో బృందం పనిచేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కొనసాగుతుండగా, ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తన ప్రతి మూవీలో టెక్నికల్ ఎఫ్ఫెక్ట్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. అదే విధంగా ఈ మూవీలో కూడా ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడే విజువల్స్తో పాటు సౌండ్ డిజైన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇప్పుడు కీరవాణి ఐదు నెలల సమయం కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో, ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో సంగీతం కథలో భాగంగా మారిపోతుందనే పేరుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
ఆడియో ఆల్బమ్ విషయంలో కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ‘సంచారి’ అనే పాట మాత్రమే విడుదల కాగా, మిగతా పాటలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సింగిల్కు మంచి స్పందన రావడంతో, తదుపరి పాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. భారీ తారాగణం, కీరవాణి సంగీతం, రాజమౌళి విజన్ కలిసిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మరో సంచలనంగా నిలవబోతోంది.
