Thu. May 28th, 2026
NTR : తెలుగువారి ఆత్మగౌరవం అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం ‘ఎన్టీఆర్’ 103వ జయంతి సందర్భంగా తెలుగు జాతి ఘన నివాళి!

జనని భారతి మెచ్చ.. జగతి హారతులెత్త..జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా.. రణభేరి మ్రోగించె తెలుగోడు.. జయగీతి నినదించె మొనగాడు ‘ఎన్టీఆర్’. కళామతల్లి ముద్దుబిడ్డగా ఎనలేని కీర్తిని అందుకుని జయహో నాయక అని జేజేలు పలికించుకున్న వన్ అండ్ ఓన్లీ లీడర్.  35సం॥ సినీ జీవితం.. 23 సినిమాలు 365 రోజులు.. 94 సినిమాలు 300 రోజులు… 185 సినిమాలు 175 రోజులు.. 18 చారిత్రకాలు.. 17 సాంఘిక చిత్రాలు.. 32 సాంఘిక నాట్యాలు…. 18 పౌరాణికం.. 95 మంది దర్శకులు.. 17 సంవత్సరాల రాజకీయ జీవితం.. 3 సార్లు ముఖ్యమంత్రి..  తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన లోక పురుషునికి జయంతి నీరాజనాలు తిరుగులేని కథానాయకుడు…. ఎదురులేని మహానాయకుడు ‘NTR’.

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయ దిక్సూచి నందమూరి తారకరామారావు (NTR). ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని యుగాలు దాటినా తెలుగుజాతి గుండెల్లో చెరిగిపోని ఏకైక పేరు ఎన్టీఆర్. రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టిస్తూ విలువలతో కూడిన పాలనకు నిజమైన నిర్వచనం చెప్పిన ఆ మహనీయుడి 103వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆ యుగపురుషునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

అప్పటివరకు కేవలం కొందరికే పరిమితమైన రాజకీయ అధికారాన్ని సామాన్యులకు, వెనుకబడిన వర్గాలకు చేరువ చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. ఆయనే అసలైన బడుగు బలహీన వర్గాల నాయకుడు. నాడు చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు (BC) 80 కి పైగా స్థానాలను కేటాయించి వారిని శాసనసభ్యులుగా అసెంబ్లీకి పంపిన అపర భగీరథుడు ఆయన. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చి గ్రామీణ స్థాయి నుంచి బలహీన వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించిన మహానాయకుడు మన రామారావు.సమాజమే దేవాలయం.. పేద ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే సంకల్పంతో ఆయన ప్రవేశపెట్టిన ‘రెండు రూపాయలకే కిలో బియ్యం’ పథకం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఒక్క పథకంతో లక్షలాది పేద కుటుంబాల ఆకలి తీర్చి, వారి ఇళ్లల్లో వెలుగులు నింపి, పేదవాడి గుండెల్లో ‘అన్నగారు’గా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. మహిళలకి ఆస్తి లో సమాన హక్కు కల్పించిన అన్న NTR.

ఢిల్లీ పీఠాన్ని సైతం గడగడలాడించి, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పిన ధీశాలి ఎన్టీఆర్. ప్రాంతీయ పార్టీల ఐక్యతతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. ప్రజాభ్యుదయ మార్గంలో నవ్య పథగామిగా నడుస్తూ ప్రజా సంక్షేమ పాలనకు స్వయంగా శ్రీకారం చుట్టారు. కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించిన ఆ మొనగాడి కీర్తి, చరిత్ర ఉన్నంతవరకు సగర్వంగా నిలిచే ఉంటుంది. నేడు ఆయన 103వ జయంతి సందర్భంగా ఆ ప్రజా నేతకు శతకోటి ప్రణామాలు!