Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులను ఫుల్ ఖుషీ చేసే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కే అవకాశాలపై ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. గతంలో విడుదలైన ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది. మూడు తరాల నటులు ఒకే తెరపై కనిపించడం, ఎమోషనల్ కథ, అద్భుతమైన కథనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమాకు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.
ఇప్పుడు అదే తరహాలో మరోసారి నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించే ప్రాజెక్ట్కు సంబంధించిన వార్తలు అక్కినేని అభిమానులతో పాటు, సినీ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున 100వ చిత్రం (#King100)కు సంబంధించిన అప్డేట్ అనంతరం ఈ కొత్త మల్టీస్టారర్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలెక్కితే అక్కినేని అభిమానులకు ఇది మరో పెద్ద పండుగగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్పై పూర్తి స్పష్టత రావాలంటే అన్నపూర్ణ స్టూడియోస్ లేదా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
