Tue. Apr 21st, 2026
Prakash Raj: నీ ద్వేషం ఎవరిపై? ప్రకాష్ రాజ్’పై నటుడు సంచలనం

నటుడు నాగ మహేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక అద్భుతమైన నటుడిగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి, తన మేధో వైకల్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని, సనాతన ధర్మాన్ని కించపరచడంపై నాగ మహేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్.. వెండితెరపై నవరసాలను పండించగల దిట్ట. కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయన కేవలం ‘విద్వేషం’ అనే రసాన్ని మాత్రమే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన హిందూ ధర్మంపై, రామాయణంపై చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంస్కార హీనతను బయటపెట్టాయని సహనటుడు నాగ మహేష్ ఎండగట్టారు. ప్రకాష్ రాజ్ అసలు ఎవరిని ద్వేషిస్తున్నారు? వ్యక్తులనా? రాజకీయ పార్టీలనా? లేక ఒక మతాన్నే లక్ష్యంగా చేసుకున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ అన్నా, బిజెపి అన్నా ఆయనకు ఉన్న వ్యతిరేకత వ్యక్తిగత ద్వేషంగా మారిపోయింది. నిత్యం “జస్ట్ ఆస్కింగ్” అంటూ పవన్ కళ్యాణ్ వంటి నేతలను ప్రశ్నించే ఆయన, ఆ ప్రశ్నల్లో తర్కం కంటే వెటకారాన్నే ఎక్కువగా నింపుతున్నారు.

Additionally Learn:Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2

సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక, ఏకంగా దేవుళ్లనే హేళన చేసే స్థాయికి దిగజారడం విచారకరం. నాస్తికుడిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్, తన తల్లి నమ్మకాన్ని గౌరవిస్తూ చర్చిలో ప్రార్థనలు చేసినప్పుడు ఆయనను అందరూ సంస్కారవంతుడిగా చూశారు. కానీ, అదే వ్యక్తి కోట్లాది మంది హిందువుల నమ్మకమైన శ్రీరాముడిని అవహేళన చేసినప్పుడు ఆయనలోని ‘సంకుచిత బుద్ధి’ బయటపడింది. “నాస్తికత్వం అంటే దేవుడిని నమ్మకపోవడం.. కానీ ఒకరి నమ్మకాన్ని కించపరచడం కాదు. ప్రకాష్ రాజ్ చేస్తున్నది నాస్తికవాదం కాదు, అది అచ్చమైన హిందూ ద్వేషం.” రామాయణ గాథను ప్రకాష్ రాజ్ వక్రీకరించిన తీరు అత్యంత హేయంగా ఉంది. లక్ష్మణుడిని రాముడు ‘లక్కీ’ అని పిలుస్తాడంటూ ఆయన చేసిన వెకిలి వ్యాఖ్యలు విజ్ఞులైన ఎవరికైనా అసహ్యం కలిగిస్తాయి. రామలక్ష్మణులు రావణుడి తోటలో పండ్లు దొంగిలించారని, దానికి శూర్పణఖ జీఎస్టీతో కలిపి బిల్లు వేసిందని ఆయన చెప్పిన కట్టుకథలు ఆయన ఉన్మాదానికి పరాకాష్ట. రాముడు ఉత్తరాది వాడని, రావణుడు దక్షిణాది వాడని లేనిపోని ప్రాంతీయ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఆయన కుటిల నీతికి నిదర్శనం. రామాయణాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రకాష్ రాజ్ కూడా తన వినాశనానికి తానే అంకురార్పణ చేసుకుంటున్నారని నాగ మహేష్ హెచ్చరించారు.