Sandeep Virk: నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ ఇటీవల పంజాబీ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలల పాటు తిహార్ జైలులో ఉండి, ఇటీవల బెయిల్పై విడుదలైన ఆమె.. ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం, సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, అవినీతి ఏ స్థాయిలో ఉందో ఈ సందర్భంగా సందీపా విర్క్ వివరించారు. ఈ పోడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరించారు.
“నిద్రపోతున్నా తలుపు తట్టాడు”
“ఒక సినిమా కోసం నేను అమృత్సర్లోని ఖల్సా కాలేజీలో ఏడు రోజుల పాటు షూటింగ్ చేశాను. ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో ఆ చిత్ర దర్శకుడు నా గది తలుపు తట్టాడు. స్నేహితుడే కదా అన్న నమ్మకంతో నేను తలుపు తీశాను. కానీ అతను లోపలికి వచ్చి నేరుగా నా మంచం మీద కూర్చున్నాడు. ఆ రాత్రి అక్కడే తనతో గడపాలని ఒత్తిడి చేశాడు” అని సందీప కన్నీళ్లు పెట్టుకున్నారు. దర్శకుడి కోరికను తాను నిరాకరించినప్పుడు, అతను తీవ్ర పరిణామాలకు హెచ్చరించాడని ఆమె తెలిపారు. “నేను ఒప్పుకోకపోతే సినిమా నుంచి తీసేస్తానని బెదిరించాడు. నేను భయపడతానని అతను అనుకున్నాడు, కానీ నేను లొంగలేదు. అన్నట్టుగానే మరుసటి రోజు ఉదయం షూటింగ్ లేదని చెప్పి నన్ను సినిమా నుంచి తొలగించాడు. అయితే ఆ సినిమా తర్వాత ఫ్లాప్ అయింది. నిజాయితీగా ఉన్నవారికి అన్యాయం చేస్తే దేవుడు తప్పకుండా బుద్ధి చెబుతాడు” అని ఆమె పేర్కొన్నారు.
మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలుకు వెళ్లిన సమయంలో తనకు ఎదురైన పరిస్థితులను కూడా సందీప వివరించారు. ముఖ్యంగా జైలు నిబంధనల పేరుతో చేసే తనిఖీలు మహిళలకు అత్యంత అవమానకరంగా ఉంటాయని ఆమె చెప్పారు. జైలుకు పంపే ముందు గర్భ నిర్ధారణ పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ కొంతమంది యువకులు పదేపదే ఆ పరీక్ష చేయించుకోవాలని ఒత్తిడి చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందని ఆమె తెలిపారు. జైలు ఎంట్రీ ప్రక్రియలో మహిళా ఖైదీల పట్ల ప్రవర్తించే తీరు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటుందని ఆమె ఆ ఇంటర్వ్యూలో వాపోయారు. ప్రస్తుతం సందీపా విర్క్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబీ ఇండస్ట్రీలోని వేధింపులపై ఆమె ధైర్యంగా మాట్లాడటంపై పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
