Sat. Jul 25th, 2026
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!

Viswanath And Sons: సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని రూపొందిస్తుండగా, తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌లో జ్యోతిక కీలక సూచనలు ఇచ్చారని, ఆ మార్పులు కథకు మరింత బలం చేకూర్చాయని దర్శకుడు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ‘విశ్వనాథ్ & సన్స్’ కథను మొదట వినిపించిన వారిలో జ్యోతిక కూడా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ ఆమెకు చాలా నచ్చిందని, అయితే కొన్ని విలువైన సూచనలు కూడా చేశారని వెల్లడించారు. తాను చాలామందికి స్క్రిప్ట్ వినిపించినప్పటికీ, జ్యోతిక ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాత్రం బాగా ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు, ఆమె సూచించిన మార్పులు ఏంటన్నది ఇప్పుడే చెప్పనని, సినిమా విడుదలైన తర్వాత వాటి గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో జ్యోతిక సూచనలతో కథలో ఎలాంటి మార్పులు జరిగాయనే అంశంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ నటి మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఇటీవల ‘కరుప్పు’ విజయంతో మంచి ఊపుమీద ఉన్న సూర్య, ఇప్పుడు పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జ్యోతిక సూచనలు సినిమాకు ఎంత మేర ప్లస్ అయ్యాయో తెలుసుకోవాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.