Tue. Jul 14th, 2026
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్ తన సంపాదనను దీర్ఘకాలిక ఆస్తుల రూపంలోకి మారుస్తున్నారు. తాజాగా పూణే సమీపంలోని ముల్షీ తాలూకా, పింప్రి గ్రామంలో రణబీర్ సుమారు 25.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు పక్కపక్కనే ఉండే వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ‘CRE Matrix’ ద్వారా వెల్లడైన పత్రాల ప్రకారం, ఈ మొత్తం లావాదేవీ విలువ రూ. 16.42 కోట్లు. ఈ డీల్ కోసం ఆయన ఏకంగా రూ. 82.13 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.

రణబీర్ కపూర్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ రామాయణం చిత్రంలో రాముడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రణబీర్ ఈ భూమి కొనుగోలు కోసం వెచ్చించిన మొత్తం… ఆయన రామాయణ చిత్రానికి అందుకుంటున్న పారితోషికంలో దాదాపు సగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రణబీర్‌కు ముంబై వెలుపల భూములు కొనడం ఇది మొదటిసారేం కాదు. రెండు నెలల క్రితమే రణబీర్ అయోధ్యలోని ‘ది సరయూ’ ప్రాజెక్టులో రూ. 3.31 కోట్లతో ఒక ప్రీమియం ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ముల్షీ ప్రాంతం ముంబై-పూణే ప్రజలకు లగ్జరీ ఫామ్‌హౌస్‌లు, సెకండ్ హోమ్స్ నిర్మించుకోవడానికి అత్యంత ఇష్టమైన డెస్టినేషన్‌గా మారింది. 25 ఎకరాల ఈ భారీ స్థలంలో రణబీర్ భవిష్యత్తులో ఒక భారీ ఫామ్‌హౌస్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్ వంటి అగ్ర తారల సరసన రణబీర్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ‘స్మార్ట్ ఇన్వెస్టర్’ అనిపించుకుంటున్నారు.